ఇస్లామాబాద్, జనవరి 8: పాకిస్థాన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్వత పర్యాటక ప్రాంతమైన ముర్రీలో భారీ స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా వాహనాల్లో చిక్కుకొని సుమారు 22 మంది మృత్యువాత పడినట్టు అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. వందల వాహనాలను మంచు నుంచి బయటకు తీశామని, వెయ్యికిపైగా వాహనాలు ఇంకా చిక్కుకుపోయాయని వెల్లడించారు. ఇస్లామాబాద్కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ముర్రీకి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. నగరంలోకి వెళ్లే వీధులు శీతాకాలంలో మంచుతో మూసుకుపోతాయి. శనివారం నాలుగు అడుగులకుపైగా మంచు కురవడంతో ట్రాఫిక్ స్తంభించి, ప్రయాణికులు వాహనాల్లోనే చిక్కుకుపోయారని తెలిపారు.