టోక్యో, డిసెంబర్ 7: సాధారణంగా రాకెట్ దూసుకెళ్లాలంటే ఇంధనాన్ని వాడుతారు. కానీ, తొలిసారి ఇంధనానికి బదులు ఆవిరిని వాడి జపాన్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) చరిత్ర సృష్టించింది. క్యూబ్శాట్ ఈక్విలిబ్రియమ్ లూనార్ ఎర్త్ పాయింట్ 6యూ స్పేస్క్రాఫ్ట్ సాయంతో వాటర్ ప్రొపెల్లెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. నాసాకు చెందిన ఓరియన్ క్యాప్సుల్ మిషన్ నుంచి జపాన్కు చెందిన రెండు క్యూబ్శాట్లను చంద్రుడిపైకి పంపించారు. ఆర్టెమిస్-1తోపాటే ఓమోటెనాషి, ఈక్యులియస్ను ప్రయోగించారు. అందులో ఈక్యులియస్ను ఎర్త్-మూన్ లెగ్రాంజ్ పాయింట్ (ఈఎమ్ఎల్-2) వద్దకు పంపుతున్నారు. ఆ దిశగా క్యూబ్శాట్ను పంపేందుకు పరిశోధకులు ఆక్వా రెస్లెస్టోజెట్ ప్రొపల్షన్ సిస్టమ్ (ఆక్వేరియస్)ను ఉపయోగించారు.
ఆక్వేరియస్ ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యవస్థలో ఇంధనానికి బదులు నీటిని వాడుతారు. వ్యర్థ వేడిని రాకెట్ ఉపయోగించుకొని నీటిని ఆవిరిగా మార్చుతుంది. ఆ ఆవిరే అంతరిక్ష నౌకను మరింత ముందుకు తోసేలా వ్యవస్థను రూపొందించారు.
ఈఎమ్ఎల్-2పైకే ఎందుకు?
డెల్ఫినస్ అనే డిటెక్షన్ కెమెరాను ఈక్యులియస్ ఈఎమ్ఎల్-2పైకి తీసుకెళ్తున్నది. అది చంద్రుడిపై వచ్చే మెరుపులు, భూమికి దగ్గరగా ఉన్న గ్రహశకలాలను పర్యవేక్షిస్తుంది. భూమి ప్లాస్మాస్పియర్ను ఈక్యులియస్ పరిశీలిస్తుంది.