కీవ్, మార్చి 2: ఖార్కీవ్ నగరంపై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకొని రష్యా క్షిపణులను ప్రయోగిస్తున్నది. తాజాగా సిటీ కౌన్సిల్ భవనం, ప్రాంతీయ పోలీసు కార్యాలయంపై బాంబు దాడులు జరిపింది. మంగళవారం రాత్రి రష్యా ఖార్కీవ్లో పారా ట్రూపర్లను రంగంలోకి దించింది. అప్పటి నుంచి నగరంలో పోరు మరింత తీవ్రమైంది. ఖార్కీవ్లో రష్యా దాడుల్లో 21 మంది చనిపోయారు. వందకు పైగా గాయపడ్డారు. ఇది కొన్ని వార్తా సంస్థలు నివేదిస్తున్న లెక్కలు మాత్రమే. వాస్తవంలో నష్టం భారీగా ఉండొచ్చని అంచనా. మరోవైపు, రష్యా దాడుల్లో ఇప్పటివరకూ 2 వేల మంది తమ పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెనసీ సర్వీసెస్ వెల్లడించింది. ఆరు వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్టు జెలెన్స్కీ ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకూ 8.36 లక్షల మంది ఉక్రెయిన్ను విడిచిపెట్టి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.