Skin Cancer | లండన్, ఏప్రిల్ 27: చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్) తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మోడెర్నా, ఎంఎస్డీ అనే ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. పలు కొవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ ఆధారిత టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్ను తయారు చేశారు. దీనిని ఎంఆర్ఎన్ఏ-4157(వీ940)గా పిలుస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యాక్సిన్కు సంబంధించిన రెండో దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. మెలనోమా బాధితుల్లో మళ్లీ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం వరకు తగ్గించిందని తేలింది. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,100 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి.
ఈ వ్యాక్సిన్ను మూడు వారాలకు ఒక డోస్ చొప్పున తొమ్మిది డోసులు ఇస్తారు. వ్యాక్సిన్తో పాటు కీత్రుడా అనే మరో ఔషధాన్ని ఇస్తారు. మెలనోమా బారిన పడ్డ వారికి సర్జరీ చేసి తొలగించిన కణతుల నుంచి నమూనాను సేకరించి, ఏఐ ద్వారా డీఎన్ఏ సీక్వెన్సింగ్ చేసి ఆ రోగి అవసరానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ను తయారుచేస్తారు. తద్వారా ఈ వ్యాక్సిన్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను క్యాన్సర్ కణాలను వెంటనే గుర్తించి, వాటిని నాశనం చేసేలా సిద్ధం చేస్తుందని, మెలనోమా మళ్లీ తిరగబడకుండా చూస్తుందని యూసీఎల్హెచ్ ఆంకాలజిస్ట్ హెథెర్ షా తెలిపారు.