జోహెన్నెస్బర్గ్ : ప్రపంచాన్ని కరోనా ముప్పు వెంటాడుతూనే ఉన్నది. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన కేసులు.. ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా కొత్త వేరియంట్ను గుర్తించినట్లు ప్రకటించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్తో గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది.
కొత్త వేరియంట్కు బీ1.1.529 పేరు పెట్టారు. జెనోమిక్ సీక్వెన్సింగ్ ప్రకారం.. ఇప్పటి వరకు 22 మంది బీ1.1.529 వేరియంట్ బారినపడ్డారు. ఇంతకు ముందు నవంబర్ 19న శ్రీలంకలో కరోనా డెల్టా వేరియంట్ కొత్త వేరియంట్ను గుర్తించారు. దానికి B.1.617.1.AY104గా పేరుపెట్టారు. ఇది శ్రీలంకలో గుర్తించిన మూడో మ్యుటేషన్. కరోనా డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతున్నది.
ఈ ఏడాది ప్రారంభంలో, మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదయ్యేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లోనూ గుర్తించారు. సౌత్ ఆఫ్రికా ఆరోగ్యమంత్రి జో ఫాహ్లా వేరియంట్పై ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆఫ్రికా దేశంలో 1200కుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.