డెర్నా: పశ్చిమ ఆఫ్రికా దేశమైన లిబియాలో వచ్చిన జల ప్రళయం(Libya Floods) భారీ వినాశాన్ని కలిగించింది. రెండు డ్యామ్లు తెగిపోవడం వల్ల డెర్నా పట్టణం నేలమట్ట మయ్యింది. భారీ ప్రవాహంగా బురద దూసుకురావడంతో.. జనం విలవిలలాడారు. పోర్టు సిటీ డెర్నాలో సుమారు 20 వేల మంది వరకు మృతిచెంది ఉంటారని ఆ సిటీ మేయర్ వెల్లడించారు. కొందరైతే యావత్ కుటుంబాన్ని కోల్పోయారు. రాత్రికి రాత్రే వచ్చిన వరదలో .. వేల మంది ప్రాణాలు విడిచారు. వరద కొట్టుకువచ్చిన రోజున నైట్ డ్యూటీలో ఉన్న డ్రైవర్ ఉసామా అల్ హుసది ఆ విషాదంలో యావత్ కుటుంబాన్ని కోల్పోయారు. అతని భార్యతో పాటు అయిదుగురు పిల్లలు కనిపించుకుండాపోయారు. వారి ఆచూకీ కోసం ఆయన ఇంకా వెతుకుతున్నాడు. భార్య ఫోన్ స్విచాఫ్లో ఉంది. తన తండ్రికి చెందిన కుటుంబం నుంచి సుమారు 50 మంది ఆచూకీలేకుండాపోయారన్నారు. చాలా మంది మిస్స్ అయ్యారని, మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తున్న 24 ఏళ్ల వాలీ ఎడ్డిన్ మొహమ్మద్ తన కుటుంబానికి చెందిన 15 మందిని కోల్పోయాడు. 9 మంది మిత్రుల్ని కూడా అతను కోల్పోయాడు. లోయలో నుంచి వచ్చిన వరదలో వాళ్లంతా కొట్టుకుపోయి సముద్రంలోకి కలిసి ఉంటారని భావిస్తున్నట్లు ఓ వ్యక్తి తెలిపాడు.