సియోల్: ఉత్తర కొరియా.. ఈ పేరు వింటేనే ఒక నియంత.. కఠిన నిబంధనలు, ఆంక్షలు.. అగ్రరాజ్యం అమెరికాను సైతం భయపెట్టేలా అప్పుడప్పుడు క్షిపణి ప్రయోగాలు మనకు గుర్తుకు వస్తుంటాయి. ఎన్నో కఠిన ఆంక్షలు ఉన్న ఆ దేశం నుంచి ఒక కుటుంబం విజయవంతంగా తప్పించుకున్న వైనాన్ని సీఎన్ఎన్ వెల్లడించింది. అయితే ఇది రాత్రికి రాత్రేమీ జరిగిపోలేదు. దాని కోసం ఆ కుటుంబం 10 ఏండ్ల పాటు వేసిన ప్రణాళికలు, దానిని అమలు చేసేందుకు పన్నిన పథకాలు ఏ హాలీవుడ్ సినిమాకు తీసిపోని విధంగా ఉన్నాయి. కిమ్ఇల్ హ్యోక్ అనే వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేని ఉత్తర కొరియా నుంచి తన కుటుంబంతో సహా పారిపోవాలని అనుకున్నాడు.
దాని కోసం 10 ఏండ్లుగా ప్రణాళికలు వేస్తూ దశలవారీగా అమలు చేయడం ప్రారంభించాడు. సాధారణంగా దేశం నుంచి పారిపోయే వారు నదిని దాటి చైనాలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది అత్యంత సాధారణ మార్గం. కానీ చైనాలో దొరికితే తిరిగి ఉత్తర కొరియాకు పంపే ప్రమాదం కూడా ఉంది. కానీ కొందరు కొరియన్ డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజడ్) ద్వారా దక్షిణ కొరియా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. సైన్యం, మైన్స్, గన్స్తో ఉండే ఇది చాలా ప్రమాదకరం. కిమ్ఇల్ హ్యోక్ ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు.
2023 మేలో వారు అత్యవసరంగా దేశం నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి కూడా సహకరించిందన్నట్టుగా, ఆ రోజు రాత్రి భారీ వర్షం కురవడం ప్రారంభించింది. దీంతో వారు ఆ వానలోనే ఒక చేపల పడవలో ప్రయాణం ప్రారంభించారు. ఒక గార్డుకు లంచం ఇచ్చి ఎల్లో సీలో చేపల వేటకు అనుమతి పొందారు. కిమ్ భార్య, అతని తల్లి, అతని వదిన, హ్యోక్ అత్త పడవలో గోనెసంచుల అడుగున కదలకుండా పడుకున్నారు. తర్వాత ఆ పడవ తీరం నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆ సమయంలో తమ గుండె పడవ ఇంజన్ కన్నా గట్టిగా కొట్టుకుందని కిమ్ తర్వాత పేర్కొన్నారు.
సుమారు రెండు గంటల తర్వాత సముద్ర సరిహద్దు జలాల వద్దకు చేరుకున్నారు. అక్కడ కనుక ఉత్తర కొరియా పెట్రోలింగ్ సిబ్బందికి దొరికారో వారిని చంపడమో, జీవితాంతం జైలులో వేయడమో చేసేవారు. అయితే అదృష్టం వారివైపు ఉంది. మెల్లిగా వారి పడవ ఉత్తర పరిమితి రేఖను దాటింది. తర్వాత వారు దక్షిణ కొరియాలోని యెన్ప్యోంగ్ ద్వీపానికి చేరుకున్నారు. దక్షిణ కొరియా నావికా సిబ్బంది వారిని తొలుత అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఉత్తర కొరియా నుంచి వచ్చినట్టు నిర్ధారించుకుని ఆశ్రయం కల్పించారు.