వాషింగ్టన్, సెప్టెంబర్ 12: క్యాన్సర్లను గుర్తించాలంటే ప్రస్తుతం సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలు చేయాలి. కానీ, సాధారణ రక్త పరీక్షతోనే పలు రకాల క్యాన్సర్లను, అదీ.. లక్షణాలు బయటపడేకంటే ముందే గుర్తించే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరీక్షతో శరీరంలోని ఏ ప్రాంతంలో క్యాన్సర్ ఉన్నదో కూడా తెలుసుకోవచ్చని ఇంగ్లండ్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ పరిశోధకులు తెలిపారు. 50 ఏండ్ల పైబడి వయసున్న 6,529 మందిని పరీక్షించగా, 92 మందిలో క్యాన్సర్ ఉన్నట్టు బయటపడిందని వివరించారు. అందులో 36 మందికి రక్త క్యాన్సర్, ఓ మహిళకు రెండు క్యాన్సర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఈ రక్త పరీక్షకు ‘గ్యాలరీ టెస్ట్’ అని నామకరణం చేసినట్టు తెలిపారు. దీనితో రొమ్ము, కాలేయ, ఊపిరితిత్తుల, పేగు, అండాశయ క్యాన్సర్లను గుర్తించవచ్చని పేర్కొన్నారు.
ప్రాథమిక దశలోనే చికిత్స
చాలా సందర్భాల్లో క్యాన్సర్లు శరీరంలో వ్యాప్తి చెందాక గానీ బయటపడటం లేదు. కానీ, ఈ రక్త పరీక్షతో ప్రాథమిక దశలోనే, అది కూడా లక్షణాలు బయటపడేకంటే ముందే క్యాన్సర్లను గుర్తించవచ్చని శాస్త్రవేత్త ఫ్యాబ్రిక్ ఆండ్రీ వెల్లడించారు. వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం అందించటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు.