Thailand : థాయ్లాండ్లో దారుణం జరిగింది. ఒక పికప్ ట్రక్కు ఢీకొని ఎనిమిది మంది బౌద్ధ సన్యాసులు మరణించారు. ట్రక్కు నడిపింది 11 ఏళ్ల బాలుడని తేలింది. ఈ ఘటన ఈశాన్య థాయ్లాండ్లోని ముక్దాహన్ ప్రావిన్స్లో జరిగింది. ఇది థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 35 మంది బౌద్ధ సన్యాసుల బృందం ఒక క్షేత్రానికి కాలి నడకన ఉబాన్ రత్చతాని ప్రావిన్స్కు యాత్ర చేపట్టింది. ఇది 260 కిలోమీటర్ల పాదయాత్ర.
ఈ యాత్రలో భాగంగా సన్యాసులంతా కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, అతివేగంగా, ఎదురుగా వచ్చిన ఒక పికప్ ట్రక్కు వీరిని ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు బౌద్ధులు ఘటనా స్థలంలోనే మరణించారు. మిగతావారిలో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనలో మరో 14 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్కును నడిపింది ఒక 11 ఏళ్ల బాలుడు అని తేలింది. బాలుడు అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బౌద్ధులు అంటున్నారు.
తాము ఒకే వరుసలో, ఒకరివెనుక ఒకరుగా నడుచుకుంటూ వెళ్తుండగా.. ట్రక్కు అతివేగంతో వచ్చి ఢీకొందని అక్కడే ఉన్న మిగతా బౌద్ధులు తెలిపారు. ఈ ఘటనలో ట్రక్కు నడిపిన బాలుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత బాలుడిని వారికి అప్పగిస్తామని, వారే అతడిని విచారిస్తారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.