టెహ్రాన్: చోరీ కేసులో 8 మంది దోషుల చేతి వేళ్లు నరికివేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ అమానుష శిక్షపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షరియా చట్టాన్ని అమలు చేసే ఇస్లాం దేశాలు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తుంటాయి. ఇందులో భాగంగా ఒక దొంగతనం కేసులో 8 మంది దోషుల చేతి వేళ్లు తొలగించాలని ఇరాన్ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ దేశానికి చెందిన ఎన్జీవో సంస్థ అబ్డోర్రాహ్మాన్ బోరోమాండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఏబీసీ) ఈ విషయాన్ని శుక్రవారం తెలిపింది. ఆ దోషులు ఈ శిక్ష కోసం గ్రేటర్ టెహ్రాన్ జైలులో వేచి ఉన్నారని పేర్కొంది.
చేతి వేళ్ల విచ్ఛేదనం కోసం వీరిలో ముగ్గురిని వాయువ్య ఇరాన్లోని ఒరుమియే జైలుకు తరలించినట్లు ఏబీసీ వెల్లడించింది. ఈ నెల 8నే వారికి శిక్షలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ తెలియని కారణంతో వాయిదా పడినట్లు తెలిపింది. టెహ్రాన్లోని ఎవిన్ జైలులో గిలెటిన్ లాంటి పరికరం అందుబాటులోకి వచ్చిన తర్వాత వారికి ఈ శిక్షను అమలు చేస్తారని చెప్పింది. ఎనిమిది మంది దోషుల కుడి చేతిలోని నాలుగు వేళ్లను తొలగిస్తారని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ అమానుష దారుణ శిక్షపై కుర్దిస్తాన్ హ్యూమన్ రైట్స్ నెట్వర్క్ (కేహెచ్ఆర్ఎన్), ఏబీసీ కలిసి సంయుక్తంగా ఆందోళన వ్యక్తం చేశాయి. మానవ విలువలను ఉల్లంఘించే ఈ శిక్ష అమలును అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని పిలుపునిచ్చాయి.