గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ (Ceasefire) నేటితో ముగియనుంది. గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మరో రోజు పొడిగిస్తూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. అదికాస్తా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్ (Israel) , హమాస్ (Hamas) నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా మరో ఎనిమిది మందికి హమాస్ విముక్తి కల్పించింది. వారిలో ఇద్దరు ఫ్రెంచ్ దేస్తులు కాగా, మిగిలినవారు ఇజ్రాయెల్కు చెందిన వారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బందీలను రెడ్ క్రాస్కు అప్పగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్ మరో 30 మంది పాలస్తీనియన్లను (Palestinians) విడుదల చేయనుంది.
దీంతో ఇప్పటివరకు 107 మంది బందీలను హమాస్ వదిలిపెట్టింది. ఇక ఇజ్రాయెల్ 240 మంది ఖైదీలను విడుదలచేసింది. గత నెల 7న సరిహద్దుల్లోని (Israel-Hamas War) గ్రామాల నుంచి 240 మందిని హమాస్ ఎత్తుకెళ్లింది. వారిలో నలుగురిని కాల్పుల విరమణకు ముందే విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఒకరిని ఇజ్రాయెల్ సైన్యం కాపాడింది. విడుదలైన పాలస్తీనా ఖైదీల్లో ఎక్కువగా టీనేజర్లు ఉండం గమనార్హం. వీళ్లంతా రాళ్ల దాడి లాంటి ఘటనల్లో అరెస్తయ్యారు.