ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు (Imran Khan) ఆ దేశ అవినీతి నిరోధక కోర్టు 8 రోజులు కస్టడీ విధించింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రశ్నించేందుకు జాతీయ జవాబుదారీ సంస్థ (ఎన్ఏబీ) కస్టడీకి అప్పగించింది. మంగళవారం ఇస్లామాబాద్లో కోర్టు విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గుర్తు తెలియని ప్రాంతానికి ఆయనను తరలించారు. బుధవారం ఉదయం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కోర్టు విచారణ చేపట్టారు. అవినీతి కేసులపై ఇమ్రాన్ ఖాన్ను ప్రశ్నించేందుకు పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఏబీ కోర్టును కోరింది. అయితే 8 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఈ నెల 17న ఇమ్రాన్ ఖాన్ను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
కాగా, కోర్టు విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ పలు ఆరోపణలు చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన పోలీసులు తనను వేధించారని కోర్టుకు తెలిపారు. కనీసం వాష్రూమ్కు వెళ్లేందుకు కూడా తనను అనుమతించలేదని విమర్శించారు. అలాగే నెమ్మెదిగా గుండె పోటు వచ్చే ఇంజెక్షన్ తనకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రభుత్వం, మిలటరీ మధ్య ఇబ్బందులు నెలకొన్న తరుణంలో తాను తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకే తనపై లేనిపోని కేసులు మోపారని ఆయన దుయ్యబట్టారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని బుధవారం అరెస్టు చేసినట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పాకిస్థాన్లో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఆ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ విధ్వాంసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్లోని కీలక ప్రాంతాల్లో ఆర్మీని మోహరించారు. దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయడంతోపాటు స్కూళ్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.