బెర్లిన్: శబ్దంపై చిరాకుతో రోగి వెంటిలేటర్ను ఒక వృద్ధురాలు ఆఫ్ చేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రోగికి ప్రాణాపాయం కలుగుతుందని చెప్పారు. అయినప్పటికీ ఆ వృద్ధురాలు రెండోసారి కూడా వెంటిలేటర్ను ఆఫ్ చేసింది. ఈ నేపథ్యంలో రోగి ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీలోని మ్యాన్హీమ్లో ఈ సంఘటన జరిగింది. ఆ నగరంలోని ఆసుపత్రిలో 79 ఏళ్ల వృద్ధురాలికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆ వార్డులో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలు వెంటిలేటర్ శబ్దానికి చిరాకు చెందింది. దీంతో రాత్రి 8 గంటలకు ఆ వెంటిలేటర్ను ఆఫ్ చేసింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే దానిని ఆన్ చేశారు. అలా చేయవద్దని, రోగికి ఆక్సిజన్ అందించే ఆ పరికరం అత్యంత అవసరమని చెప్పారు.
అయినప్పటికీ రాత్రి 9 గంటలకు ఆ వృద్ధురాలు మరోసారి రోగి వెంటిలేటర్ను ఆఫ్ చేసింది. దీంతో ఆక్సిజన్ అందక 79 ఏళ్ల వృద్ధురాలి ఆరోగ్యం విషమించింది. స్పందించిన వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించి మెరుగైన చికిత్స అందించారు. వెంటిలేటర్ ఆఫ్ చేసి రోగి ప్రాణాలకు ముప్పు కలిగించిన ఆ వృద్ధురాలిపై ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.