పారిస్, జూలై 2: మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపిన ఘటనతో ఫ్రాన్స్ అట్టుడుకుతున్నది. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత ఆరు రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కొంతమంది ఆందోళనకారులు ఆదివారం తెల్లవారుజామున పారిస్ దక్షిణ సబర్బన్ మేయర్ విన్సెంట్ జీన్బ్రన్ ఇంటిపై దాడికి యత్నించారు. కారుతో ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లి, ఆ వాహనానికి నిప్పంటించారు. తన కుటుంబంపై హత్యాయత్నం జరిగిందని, దాడి చేసిన వారి నుంచి తప్పించుకొనే క్రమంలో తన భార్య, పిల్లలకు గాయాలయ్యాయని విన్సెంట్ తెలిపారు. ఇంత వరకు పాఠశాలలు, పోలీసుస్టేషన్లు, టౌన్హాల్స్, స్టోర్లు వంటి వాటిపై దాడులు చేసిన ఆందోళనకారులు.. ఒక మేయర్ ఇంటిపై వ్యక్తిగతంగా దాడి చేయడం అసాధారణంగా కనిపిస్తున్నది. ఆదివారం దేశవ్యాప్తంగా 719 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఫ్రాన్స్ ఆందోళనలు ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. స్విట్టర్లాండ్లోని లౌసన్ పట్టణంలో పలువురు ఆందోళన చేశారు.