న్యూయార్క్, మార్చి 29: ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన భారత సంతతికి చెందిన ఏడుగురు టెకీలపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ ట్రేడింగ్ ద్వారా రూ. 7.5 కోట్లు అర్జించినట్టు ఫెడరల్ అధికారులు తెలిపారు. రెండేండ్ల క్రితం నాటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హరిప్రసాద్ సూరి, లోకేశ్ లగుడు, చోటు ప్రభుతేజ్ పులగం ముగ్గురు మిత్రులు. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ‘ట్విలియో’లో పనిచేస్తున్నారు. 2020లో హరిప్రసాద్.. ట్విలియో కంపెనీ భవిష్యత్తు ప్రణాళిక రహస్య సమాచారాన్ని మిత్రుడు దిలీప్ రెడ్డికి చేరవేశాడు. అలాగే లోకేశ్ కూడా తన గర్ల్ఫ్రెండ్తో పాటు మరో స్నేహితుడు అభిషేక్కు కంపెనీ విషయాలు చెప్పాడు. ప్రభుతేజ్ తన సోదరుడు చేతన్ ప్రభుకు కూడా ఈ విషయాలను వెల్లడించాడు. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయని ముందుగానే తెలుసుకొన్నారు. అలా ఫలితాల ప్రకటన వచ్చే ముందే బ్రోకరేజ్ ఖాతాల ద్వారా ట్విలియో ఆప్షన్లు, స్టాక్స్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2020 మే 6న ట్విలియో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడం, కంపెనీ షేర్లు పెరుగడం చకచకా జరిగిపోయాయి. అనుమానం వచ్చిన సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ ఆరా తీయగా మోసం బయటపడింది. నిందితులు ఓ ప్రైవేటు చాట్ ఛానల్ ద్వారా తెలుగులో మాట్లాడుకొన్నట్టు అధికారులు తెలిపారు.