వాషింగ్టన్ : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే సోమవారం మధ్యాహ్నం అయోవాలో డెస్ మోయిన్స్ చార్టర్ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకు ముందు సైతం కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు పది మంది వరకు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. షికాలో తెలుగు విద్యార్థులపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏపీలోని బెజవాడకు చెందిన దేవాశిష్ అనే విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి గాయపడ్డాడు. అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలవరానికి గురి చేస్తున్నాయి.