టోక్యో: జపాన్లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. ఫుకుషిమా తీరంలోని 60 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని పేర్కొంది. స్థానిక కాలం ప్రకారం బుధవారం రాత్రి 11:36 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. 297 కిలోమీటర్ల దూరంలోని రాజధాని టోక్యో వరకు భూకంపం ప్రభావం కనిపించినట్లు పేర్కొంది.
కాగా, ఈశాన్య తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అలలు ఒక మీటర్ ఎత్తు వరకు ఎగసిపడవచ్చని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు జపాన్లో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ పేర్కొంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు.
మరోవైపు 2011లో కూడా ఉత్తర జపాన్లో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ఉద్భవించిన సునామీ అణు విపత్తుకు కారణమైంది.