కాబూల్, ఆగస్టు 26: తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే అఫ్గానిస్థాన్లో నెత్తుటేర్లు పారాయి. కాబూల్ బాంబులతో దద్దరిల్లింది. ఉగ్ర దాడితో హమీద్ కర్జాయ్ విమానాశ్రయం రక్తసిక్తమైంది. గురువారం సాయంత్రం ఎయిర్పోర్ట్లోని ‘అబే’ గేట్, విమానాశ్రయం ఆవరణలోని బారోన్ హోటల్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 60 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, విదేశీయులతో పాటు అమెరికా సైనికులు, తాలిబన్లు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఆత్మాహుతి దాడుల అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. జంట పేలుళ్లను అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధ్రువీకరించింది. ‘అబే’ గేట్ వద్ద తొలి పేలుడు జరిగిన కొద్ది సేపట్లోనే హోటల్ సమీపంలో రెండో పేలుడు జరిగినట్టు పేర్కొంది. ఈ ఘటనలో డజను మంది అమెరికా సైనికులు మరణించగా, ముగ్గురు గాయపడ్డట్టు వెల్లడించింది. కాబూల్ పేలుళ్ల వెనుక ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) హస్తం ఉన్నట్టు అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, అంతకుముందు కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాద దాడి జరుగొచ్చని, వెంటనే ఆ పరిసర ప్రాంతాలను వీడి వెళ్లాలని తమ పౌరులను అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు హెచ్చరించాయి. ఐసిస్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఉగ్రవాద దాడుల గురించి హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ వరుస పేలుళ్లు జరుగడం గమనార్హం. జంట పేలుళ్లు జరిగిన తర్వాత సెంట్రల్ కాబూల్లో రాత్రి పొద్దుపోయాక మరో మూడు పేలుళ్లు జరిగినట్టు వార్తలు వచ్చాయి.
దాడులను ఖండించిన తాలిబన్లు
ఎయిర్పోర్ట్లో ఆత్మాహుతి దాడులను తాలిబన్లు ఖండించారు. ఐసిస్ గ్రూప్ కాబూల్ విమానాశ్రయంపై దాడులకు పాల్పడవచ్చని తాము ముందుగానే అనుమానించామని, ఇదే విషయాన్ని అమెరికాకు కూడా చెప్పామని ఓ ప్రకటనలో తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం అమెరికా దళాల ఆధీనంలో ఉన్నట్టు పేర్కొన్నారు. కాబూల్ ఉగ్రవాద దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు.
‘అష్ట’వ్యూహాలు
నిరసనకారులను శాంతింపజేసి అఫ్గాన్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారు. అసమ్మతి అంతర్యుద్ధంగా మారకుండాకట్టడి చేయాలనుకుంటున్నారు. అఫ్గానిస్థాన్కు చెందిన ఎనిమిది మంది కీలక నేతలతో మంతనాలు జరుపడానికి సమాయత్తమయ్యారు. దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభావితం చేయగల వీరితో సత్సంబంధాలు కొనసాగిస్తే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ సులభమవుతుందని తాలిబన్ల ఆలోచన. ఇప్పటికే ఒకరిద్దరు నేతలతో కూడా భేటీ నిర్వహించినట్టు తెలుస్తున్నది. తాలిబన్ల జాబితాలో ఉన్న కీలక నేతల్లో.. గుల్బుద్దీన్ హెక్మత్యార్ (మాజీ ప్రధాని, హిజ్బే ఇస్లామీ రాజకీయ పార్టీ నాయకుడు, అమెరికా ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది), హమీద్ కర్జాయ్ (మాజీ ఉపాధ్యక్షుడు), అబ్దుల్లా అబ్దుల్లా (ఉత్తర కూటమి నాయకుడు అహ్మద్ షా మస్సౌద్-సీనియర్కు సలహాదారుడు), అబ్దుల్ రషీద్ దోస్తుం (ఉత్తర కూటమిలో కీలక నాయకుడు, మాజీ ఉపాధ్యక్షుడు), అమ్రుల్లా సాలేహ్ (మాజీ ఉపాధ్యక్షుడు), అహ్మద్ మస్సౌద్ (ఉత్తర కూటమి సేనల నాయకుడు, కమాండర్ అహ్మద్ షా మస్సౌద్ కుమారుడు), అటా మహమ్మద్ నూర్ (తజిక్ తెగ నాయకుడు, ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్), మహమ్మద్ కరీం ఖలీలి (మాజీ ఉపాధ్యక్షుడు, హజారా తెగ నాయకుడు) ఉన్నారు. కాగా, పాకిస్థాన్ తమకు రెండో ఇళ్లని, అఫ్గాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని తాలిబన్ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
వాటర్ బాటిల్ ధర రూ.3 వేలు
విదేశాలకు తరలివెళ్దామని కాబూల్ ఎయిర్పోర్టులో వేచి ఉన్న పౌరులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. తినడానికి ఆహారం, తాగడానికి మంచినీరు కూడా దొరకడంలేదు. అక్కడి దుకాణాల్లో కొనుగోలు చేద్దామంటే రేట్లు అకాశాన్నంటుతున్నాయి. మంచినీళ్ల సీసాను 40 డాలర్లకు (రూ. 2,965), ప్లేట్ రైస్కు 100 డాలర్లకు (రూ. 7,414) విక్రయిస్తున్నారు. చెల్లింపులకు అఫ్గాన్ కరెన్సీ కాకుండా, అమెరికన్ డాలర్లనే ఇవ్వాలని పట్టుబడుతున్నారు.