South Korea fire | దక్షిణ కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సొరంగం గుండా వెళ్తున్న బస్సు-ట్రక్కు ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 37 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది ఈ ఘటన గ్వాచియాన్ నగరంలో గురువారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్వాచియాన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్ప్రెస్వే సొరంగం గుండా వెళ్తున్న బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. దాంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు సొరంగంలో మంటలు అంటుకోవడానికి దారితీసింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. 37 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో సొరంగం ప్రాంతం పొగ మేఘాలు కమ్ముకున్నాయి.
మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు దాదాపు 50 అగ్నిమాపక యంత్రాలు, సామగ్రితోపాటు 140 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. దాదాపు గంట సమయం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం అందలేదు. అలాగే, ప్రమాదంలో బొగ్గుగా మారిన ట్రక్కులో ఏ వస్తువులు తీసుకెళ్తున్నారనేది తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గ్వాచియాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరగడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. గ్వాచియాన్ పట్టణం దక్షిణ కొరియా రాజధాని సియోల్కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.