Pakistan Citizens | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ విధించిన డెడ్లైన్ ఆదివారంతో (మెడికల్ వీసా వారికి 29 వరకు) ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక్ పౌరులు, దౌత్యవేత్తలు అటారీ-వాఘా సరిహద్దు వెంబడి దేశాన్ని వదిలి పాక్కు తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అమృత్సర్లోని ఈ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆదివారం పెద్దయెత్తున వాహనాలు బారులుతీరాయి. చాలామంది భారతీయులు దేశం విడిచివెళ్తున్న తమ బంధువులకు వీడ్కోలు పలకడానికి అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. 12 క్యాటగిరీల కింద స్వల్ప కాల వ్యవధి వీసాదారులు ఈ నెల 27లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. సార్క్ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్ 26, మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ 29 డెడ్లైన్గా విధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్కు చెందిన 14 మంది దౌత్యవేత్తలు సహా 850 మంది ఈ అంతర్జాతీయ సరిహద్దు గుండానే భారత్కు చేరుకున్నారు.
తెలంగాణలో అధికారిక రికార్డుల ప్రకారం 208 మంది పాకిస్థాన్ పౌరులున్నారని పోలీస్ చీఫ్ జితేందర్ తెలిపారు. వీరిలో చాలామంది హైదరాబాద్లోనే ఉన్నారన్నారు. వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు, 13 మందికి స్వల్పకాలిక, 39 మంది పర్యాటక, వైద్య, వ్యాపార వీసాలపై వచ్చారన్నారు.
దేశంలో ఉన్న పాక్ పౌరుల లెకలు తీస్తున్న వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో 107 మంది పాకిస్థానీయులు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డాటా ప్రకారం వివిధ రకాల వీసాలపై 5,050 మంది పాకిస్థానీలు ప్రస్తుతం రాష్ట్రంలో నివసిస్తున్నారు. వీరిలో 107 మంది జాడ తెలియడం లేదని, వీరి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఒక వేళ ఆదేశాలు ధిక్కరించి, ప్రభుత్వం విధించిన డెడ్లైన్ లోగా భారత్ విడిచి వెళ్లని పాకిస్థానీయులను అధికారులు అరెస్ట్ చేస్తారు. వారికి మూడేండ్ల జైలు శిక్ష, లేదా 3 లక్షల జరిమానా లేక రెండు శిక్షలూ విధిస్తారు.