ఢాకా, ఆగస్టు 8: శ్రీలంక, పాకిస్థాన్ మాదిరిగానే పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్టు తెలుస్తున్నది. పెట్రోల్ ధరను ఏకంగా 52 శాతం పెంచుతూ షేక్ హసీనా సర్కారు నిర్ణయించడంపై విద్యార్థులు, పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభు త్వం వెంటనే పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
స్వాతంత్య్రం వచ్చాక ఇదే తొలిసారి
ఇంధన ధరలను పెంచుతూ గత శుక్రవారం బంగ్లా సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్పై 51.1 శాతం, డీజిల్, కిరోసిన్పై 42.5 శాతం, ఆక్టేన్పై 51.7 శాతం పెంపు విధిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 44 టాకాలుగా (బంగ్లా కరెన్సీ) (మన రూపాయల్లో రూ. 37) ఉన్న లీటర్ పెట్రోల్ ధర 130 టాకాలకు (రూ. 109) పెరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగడంతో ప్రజారవాణా సంస్థలు కూడా టికెట్ రేట్లను పెంచాయి. రవాణా భారం పెరుగడంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడింది. సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ధరలవాత ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. 48 గంటల్లోగా ప్రభుత్వం ధరలను తగ్గించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పలు చోట్ల వాహనాలను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
దిగుమతులే కొంప ముంచాయి
416 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన బంగ్లాదేశ్ గతకొంతకాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా ఇంధన, ఆహార ధరలు పెరిగిపోవడం, వాటి దిగుమతులపై బంగ్లా ప్రధానంగా ఆధారపడటం ప్రస్తుతం ఆ దేశ పరిస్థితిని మరింతగా దిగజార్చింది. దేశంలో ఫారెక్స్ నిల్వలు అంతకంతకూ పడిపోతుండటంతో గత నెల 24న 4.5 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించాలని ఇంటర్నెషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)కుషేక్ హసీనా సర్కారు విజ్ఞప్తి చేసింది.