జెరుసలాం: ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్పై ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్పై జరిగిన దాడిలో మొదటి రోజే ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీతో పాటు సుమారు 40 మంది మిలిటరీ కమాండర్లు చనిపోయారు. అయితే కేవలం 40 సెకన్లలోనే 40 మంది టాప్ ఇరానీ మిలిటరీ కమాండర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం(IDF) పేర్కొన్నది. ఇరాన్తో సీజ్ఫైర్ కుదిరిన నేపథ్యంలో ఐడీఎఫ్ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. 40 రోజుల వార్లో అనేక మంది ఇరానీ కమాండర్లను చంపినట్లు ఐడీఎఫ్ చెప్పింది. డజన్ల సంఖ్యలో సీనియర్, మీడియా రేంజ్ ఇరానీ ఆఫీసర్లను కూడా ఏరివేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 5 వేల మంది ఇరానీ సైనికులు మృతిచెందినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. వేల సంఖ్యలో ఇరానీ సైనికులు గాయపడినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. మృతుల్లో అంతర్గత భద్రతా బలగాలు, బసిజి పారామిలిటరీ దళాలు ఉన్నట్లు తెలిసింది.
ఇజ్రాయిలీ అటాక్లో మృతిచెందిన వారిలో ఖమేనీతో పాటు మిలిటరీ అడ్వైజర్ అలీ శామ్ఖానీ, ఐఆర్జీసీ కమాండ్ మొహమ్మద్ పాక్పౌర్, ఐఆర్జీసీ నేవీ చీఫ్ అలీరెజా తంగసిరి, ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీప్ మసీద్ ఖాదేమి, బసిజి పారామిలిటరీ దళ కమాండర్ గోలంరెజా సోలేమానీ, ఐఆర్జీసీ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైని, నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ హెడ్ అలీ లారిజారి, డిఫెన్స్ మినిస్టర్ అజిన్ నాసిర్జాద్ఏ, ఎస్ఎపీఎన్డీ చైర్మెన్ హుసేన్ జాబల్ అమేలియన్, ఖమేనీ మిలిటరీ సెక్రటరీ మొహమ్మద్ షిరాజి ఉన్నారు.
ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. అనేక ఇరానీ అణు కేంద్రాలపై దాడులు చేసినట్లు చెప్పింది. ఇరాన్ వద్ద సుమారు 60 శాతం శుద్దీకరించిన 400 కేజీల యురేనియం ఉన్నట్లు ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది. ఆ యురేనియంతో దాదాపు 11 అణు బాంబులను తయారు చేయవద్దు అని ఇజ్రాయిల్ అధికారులు అంచనా వేశారు. యాజ్ద్ పట్టణం వద్ద ఉన్న న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అరాక్లో ఉన్న హెవీ వాటర్ రియాక్టర్పై కూడా దాడి జరిగింది. టెహ్రాన్లోని మలేక్ అస్తార్ యూనివర్సిటీలో ఉన్న న్యూక్లియర్ రీసర్చ్ డెవలప్మెంట్ సైట్, పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్లోని తలేగాన్ 2 కేంద్రం, మిన్జాదేహి సీక్రెట్ అండర్గ్రౌండ్ కేంద్రంతో పాటు ఇతర అణు కేంద్రాలను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఇరాన్కు ఆర్థిక నష్టం కలిగించే గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. రెండు భారీ స్టీల్ ఫ్యాక్టరీలు, అనేక పెట్రోకెమికల్ కేంద్రాలు, 10 కీలకమైన రైలు మార్గాలు, బ్రిడ్జ్లను పేల్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. పెట్రోకెమికల్ కేంద్రాల్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. రైలు మార్గాలు, బ్రిడ్జ్ల ద్వారా ఆయుధాలను ఇరాన్ సరఫరా చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.