లండన్, జూలై 27: ఫైజర్, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు తీసుకున్న ఆరువారాల అనంతరం శరీరంలో ప్రతిరక్షకాల (యాంటిబాడీలు) సంఖ్య క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న 2-3 నెలలు లేదా 10 వారాల అనంతరం యాంటిబాడీల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోతుందని పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. కొత్త వేరియంట్లు విరుచుకుపడుతున్న ఈ సమయంలో టీకా వేసుకున్నప్పటికీ యాంటిబాడీల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని పరిశోధకులు తెలిపారు.