దుబాయ్, ఏప్రిల్ 25: ఆధునికతను అందిపుచ్చుకోవడంలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉండే యూఏఈ ఏఐ సాయంతో సగం ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే ప్రాజెక్ట్ చేపట్టింది. అధ్యక్షుడు షేక్ మొహ్మమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు రానున్న రెండేండ్లలో యూఏఈ ప్రభుత్వ రంగాలు, సేవలు, కార్యకలాపాలను సగం మేరకు స్వయం ప్రతిపత్తి గల కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థలుగా మార్చనున్నారు. ఈ కీలక మార్పును యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం ప్రకటించారు. వచ్చే రెండేండ్లలో ప్రభుత్వ సేవల్లో 50 శాతాన్ని స్వయం ప్రతిపత్తి గల ఏఐకి బదిలీ చేయనున్నట్లు ఎక్స్ పోస్టులో ఆయన తెలిపారు.
పనులను స్వతంత్రంగా నిర్వహించడం, ప్రక్రియలను నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటం వంటి సామర్థ్యం గల ఏజెంటిక్ ఏఐ నమూనాలను స్వీకరించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా యూఏఈని నిలపడమే ఈ ప్రణాళిక లక్ష్యమని ఆయన చెప్పారు. మార్పులకు అనుగుణంగా మందుకు సాగేవారి సామర్థ్యం ఆధారంగా రానున్న రెండేండ్లలో మంత్రులు, డైరెక్టర్ జనరళ్లు, ప్రభుత్వ సంస్థలను అంచనా వేయడం జరుగుతుందని షేక్ మహమ్మద్ అన్నారు. ఇందులో భాగంగా వారు కొత్త ప్రమాణాలను ఎంత వేగంగా అమలు చేస్తారు, ప్రభుత్వ కార్యకలాపాలను పునర్ నిర్మించడానికి ఏఐ సాధనాలను ఎంత త్వరగా స్వీకరిస్తారు అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.