Turkey-Syria Earthquake | తుర్కియే, సిరియా సరిహద్దుల్లో గత సోమవారం సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాలను తొలగించినాకొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఈ ఘోర విపత్తులో రెండు దేశాల భూభాగాల్లో కలిపి ఇప్పటివరకు మృతుల సంఖ్య 41 వేలు దాటింది. ఒక్క తుర్కియేలోనే 35,418.. సిరియాలో 5,800 పైగా మృతదేహాలు బయటపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
అయితే భూకంపం సంభవించి పది రోజులు కావొస్తున్నాశిథిలాల కింద నుంచి ఇంకా కొంతమంది సజీవంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆహారం, మంచినీళ్లు కూడా లేకుండా వాళ్లు పది రోజులుగా శిథిలాల కిందే బతికి ఉండటం విస్మయం కలిగిస్తోంది. తాజాగా తుర్కియేలోని కహరామనమారస్ (Kahramanmaras) ప్రాంతంలో భూకంపం సంభవించిన 222 గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న 42 ఏండ్ల మహిళను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
మరోవైపు రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 74 దేశాలకు చెందిన సహాయక బృందాలు ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తుర్కియే ప్రభుత్వం తెలిపింది.