కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో ఎడతెరపిలేని మంచుపాతం విషాదం మిగిల్చింది. భారీగా మంచు కురవడంతో ఆ భారానికి పలుచోట్ల ఆవాసాలు మంచులో కూరుకుపోయాయి. మరికొన్నిచోట్ల మంచు బరువుకు ఇండ్లు కూలిపోయాయి. ఈ ప్రకృతి వైపరీత్యం 42 మందిని పొట్టనపెట్టుకుంది. మరో 76 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది.
మొత్తం 15 ప్రావిన్స్లలో మంచుపాతం బీభత్సం కొనసాగిందని ఆఫ్ఘనిస్థాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘన్లో మంచు వర్షం కురుస్తున్నదని, ఈ 20 రోజుల్లో దాదాపు 2,000 ఇండ్లు ధ్వంసమయ్యాయని ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ సర్కారు మీడియాకు తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్పారు.
ప్రధాన రహదారులపై కూడా ఎక్కడికక్కడ మంచు పేరుకుపోవడంతో జనం ఎక్కడివాళ్లు అక్కడే ఇరుక్కుపోయారు. బాధితుల సహాయార్థ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఆఫ్ఘనిస్థాన్లో గత వారం రెండు భూకంపాలు కూడా విషాదం మిగిల్చాయి. ఆ రెండు భూకంపాల ధాటికి 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 ఇండ్లు ధ్వంసమయ్యాయి.