Nigeria : నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ చోరీ చేసేందుకు పైప్లైన్ను ధ్వంసం చేయగా.. అందులోంచి విష వాయువులు విడుదలై 37 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ నైజీరియాలోని రివర్స్ స్టేట్లో ఉన్న ఒక్రికాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. ఈ విషయంపై స్థానిక ‘ద యూత్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అడ్వోకసీ సెంటర్’ శుక్రవారం కొన్ని వివరాలు వెల్లడించింది.
దీని ప్రకారం.. స్థానికంగా ఒకారి జెట్టి ప్రాంతంలో ఒక చమురు సంస్థకు సంబంధించిన భారీ పైప్లైన్ ఉంది. ఇందులో సాధారణంగా క్రూడాయిల్ సరఫరా అవుతుంటుంది. గురువారం రాత్రి కొందరు స్తానిక దొంగలు బోట్లలో వచ్చి, ఈ క్రూడాయిల్ పైప్లైన్ పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఇందులోంచి చమురును దొంగిలించి, తీసుకెళ్దామనుకున్నారు. ఈ క్రమంలో పైప్లైన్ను పగులగొట్టగానే అందులోంచి భారీ స్థాయిలో విష వాయువులు విడుదలయ్యాయి. దీంతో ఆ విష వాయువులు పీల్చి 37 మంది మరణించారు.
ఇంకా మృతులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఇంకా వారి మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి. మృతదేహాల్ని వెలికితీసే చర్యలు చేపట్టారు. అయితే, ఈ పరిస్థితికి గల కారణాలపై ఇంకా విచారణ జరుగుతోందని, తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరమే వారి మరణాలకు గల కారణాలపై స్పష్టత వస్తుందన్నారు.
పేదరికం, నిరుద్యోగంతో అల్లాడే నైజీరియాలో చమురు దొంగతనం చాలా సాధారణం. చమురు సంస్థల పైప్ లైన్ల నుంచి చమురు దొంగిలించి, బయటి మార్కెట్లలో అమ్ముకుంటారు. ఈ చర్యల వల్ల స్థానిక చమురు సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి.