ఢాకా : బంగ్లాదేశ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని జకాకతికి సమీపంలోని ఓ నదిలో వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో పడవలో ప్రయాణిస్తున్న వారిలో 37 మంది మంటల్లో కాలిపోయారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మరికొంత మంది నదిలో దూకారు. మంటల్లో గాయపడిన 100 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారి మోయినుల్ ఇస్లామ్ తెలిపారు.
అయితే పడవ ఇంజిన్ రూమ్లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుంది. అప్పటికే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మంటల సెగకు మెలకువ వచ్చిన వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు నీటిలోకి దూకారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఒబ్హిజాన్ 10లో ఒకేసారి 500 మంది ప్రయాణించొచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 500 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గురైన పడవను నది ఒడ్డుకు తీసుకొచ్చారు.