అబూజ: నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ సిటీలో విషాద ఘటన చోటుచేసుకున్నది. హార్కోర్ట్లోని చర్చి (Church) వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం చర్చి వద్ద నిర్వహించిన చారిటీ ఈవెంట్లో భాగంగా ఆహార పదార్థాలు, కానుకలు పంపిణీ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. .
గిఫ్టులు, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండటంతో భారీగా జనం వచ్చారని, బహుమతులు పంచుతుండగా అంతా ఒక్కసారే ఎగబడ్డారని, దీంతో తొక్కిసలాటకు దారి తీసిందని తెలిపారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.
ఆఫ్రికాలో అత్యధికంగా ముడి చమురును ఉత్పత్తి చేస్తున్న, జనాభా కలిగిన దేశాల్లో నైజీరియా ఒకటి. దేశంలో ప్రధాన చమురు క్షేత్రం పోర్ట్ హార్కోర్ట్. కాగా, దేశంలోని ప్రతి పదిమందిలో నలుగురు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని ప్రపంచ బ్యాంకు తెలిపింది.