దుబాయ్: ఏకంగా 2 లక్షల మందికిపైగా కార్మికులు పాలుపంచుకుంటున్న దుబాయ్ ఎక్స్పో నిర్మాణ ప్రదేశంలో ఇప్పటి వరకూ ముగ్గురు మరణించారని, మరో 70 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. తాము ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆరు నెలల పాటు దుబాయ్లో ఈ ఎక్స్పో జరగనున్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం వలస కార్మికుల పట్ల యూఏఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అంతేకాకుండా ఆ దేశ మానవ హక్కుల రికార్డు కూడా అంత బాగాలేదని ఆరోపిస్తూ.. ఈ ఎక్స్పోను బాయ్కాట్ చేయాలని యురోపియన్ పార్లమెంట్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ డేటాను రిలీజ్ చేశారు.
దుబాయ్ శివార్లలో జరుగుతున్న ఈ నిర్మాణ పనుల్లో 2 లక్షలకుపైగా కార్మికులు పాలుపంచుకుంటున్నట్లు వాళ్లు చెప్పారు. విశాలమైన ప్రదేశంలో వందల కొద్దీ పెవిలియన్లు, ఇతర వసతులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాల్లోని వలస కార్మికుల పట్ల యూఏఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తమకు మాత్రం కార్మికుల సంక్షేమమే మొదట ప్రాధాన్యత అని, దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని, మరో 72 మంది తీవ్రంగా గాయపడ్డారని ఎక్స్పో అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 24.7 కోట్ల పని గంటలు జరగగా.. బ్రిటన్ కంటే చాలా తక్కువ స్థాయిలోనే ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు.