కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మళ్లీ వరుస పేలుళ్లలతో దద్దరిల్లుతున్నది. బుధవారం ఒక మసీదులో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించారు. 25 మందికిపైగా గాయపడ్డారు. కాబూల్లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో ఉన్న మసీదులో ఈ పేలుడు జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అధికార తాలిబన్ కూడా దీనిని నిర్ధారించింది. ప్రభుత్వ మంత్రిత్వశాఖ కార్యాలయం ప్రాంగణంలోని మసీదులో అధికారులు, సందర్శకులు ప్రార్థనలు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలిపింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా, గత ఏడాది ఆగస్ట్లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగిన నేపథ్యంలో తాలిబన్లు మెరుపు వేగంతో కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తాలిబన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాబూల్లో ఇటీవల వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. కాబూల్లోని ఒక స్కూల్ క్లాస్ రూమ్లో ఇటీవల జరిగిన సూసైడ్ బాంబు దాడిలో 53 మంది విద్యార్థులు మరణించారు. ఇందులో 46 మంది బాలికలు.