రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉండే భారతీయ విద్యార్థులపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఎలాంటి సమాచారం కావాలన్నా,సహాయ సహకారాలు కావాలన్న వెంటనే ఉక్రెయిన్లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. అంతేకాకుండా దీని కోసమే ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పర్చారు. 24 గంటలూ అందుబాటులో ఉండే ఓ హెల్ప్లైన్ నెంబర్ను కూడా అక్కడి విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది.
ఉక్రెయిన్లో ఉండే భారతీయ విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ : 1800118797
ఫోన్ నెంబర్లు : +91 11 23012113, +91 11 23014104, +91 11 23017905
ఫ్యాక్స్ : +91 11 23088124
ఈ మెయిల్ : situationroom@mea.gov.in
24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ : +380 997300428, +380 997300483
వెబ్సైట్ : eoiukraine.gov.in
విమాన సర్వీసులను పెంచుతాం.. భయం వద్దు : భారత ప్రభుత్వం
ఇక విద్యార్థులెవ్వరూ విమానాల విషయంలో భయాందోళనలకు గురి కాకూడదని భారత ప్రభుత్వం భరోసా కల్పించింది. ఎవరూ ఆందోళనలకు గురి కావొద్దని, భారత్- ఉక్రెయిన్ మధ్య నడిపే విమానాల సంఖ్యను పెంచుతామని ఉక్రెయిన్లో ఉండే భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖతో పాటు, మరిన్ని విమానయాన కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. విమాన టిక్కెట్లు దొరక్క భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని భారత ప్రభుత్వం పేర్కొంది.