Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ 2024 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై విమర్శలు గుప్పించిన మాజీ అధ్యక్షుడు తాజాగా మరోసారి 2020 ఎన్నికల అంశాన్ని లేవనెత్తారు. ఓ సోషల్ మీడియా పోస్ట్లో 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అని పేర్కొన్న ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. తనకు వ్యతిరేకంగా బడా టెక్ కంపెనీలు డెమోక్రాట్లతో జతకట్టాయని ఆరోపించారు.
ట్రంప్ తన సోషల్ మీడియా నెట్వర్క్ యాప్ ట్రూత్ పోస్ట్లో 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ఇటీవల ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2020 ఎన్నికల సమయంలో జోబైడెన్ టీంతో ట్విట్టర్ మాజీ టీం సంభాషణలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ విడుదల చేశారు. ఈ మేరకు ట్రంప్ స్పందించారు. డెమోక్రాట్లతో కలిసి తనకు వ్యతిరేకంగా టెక్ కంపెనీలు కుట్ర పన్నాయని ట్రంప్ ఆరోపించారు. ‘మా గొప్ప వ్యవస్థాపకులు తప్పడు, మోసపూరిత ఎన్నికలను కోరుకోలేదు. అలాంటి వాటిని క్షమించరు’ అంటూ పోస్ట్ చేశారు.
ట్రంప్ ప్రకటనను వైట్హౌస్ ఖండించింది. గెలిచినప్పుడే అమెరికాను ప్రేమించలేమని వైట్హౌస్ అధికార ప్రతినిధి ఆండ్రూబేట్స్ అన్నారు. రాజ్యాంగం పవిత్రమైందన్న ఆయన.. ట్రంప్పై విమర్శలు గుప్పించారు. 2020 ఎన్నికల ఫలితాల కంటే ముందు రాజ్యాంగంలోని అన్ని నియమాలు, నిబంధనలను, ఆర్టికల్స్ను రద్దు చేయాలనే ఆలోచన ట్రంప్కు ఉండేదని తాము నమ్ముతున్నామని.. అది నేటికీ ఆయన ఆలోచనగా మిగిలిపోయిందన్నారు. ‘ట్రంప్ రాజ్యాంగానికి శత్రువు’ అని నిజాయితీపరులు ఎవరూ కాదనలేరని అన్నారు.