గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) పాలస్తీనాలోని గాజాలో (Gaza) రక్తపుటేరులు పారిస్తున్నది. ఇజ్రాయెల్ (Israel) దాడులతో గాజా స్ట్రిప్లో అమాయక పౌరులు మరణిస్తున్నారు. గత నెల సెంట్రల్ గాజాలోని ఓ దవాఖానపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 500 మందికిపైగా మృతిచెందగా, మూడు రోజుల క్రితం జబాలియా శరణార్థి శిబిరంఉన్న అపార్ట్మెంటుపై జరిగిన వైమానిక దాడిలో 50 మందికిపైగా మృత్యువాతపడ్డారు. తాజాగా గాజాలోని ఓ స్కూల్పై (School) మోర్టార్ షెల్స్తో (Mortar shells) ఇజ్రాయెల్ దాడి చేసిందని, దీంతో 20 మంది చనిపోయారని, డజన్ల కొద్ది గాయపడ్డారని హమాస్ నేతృత్వంలోని పాలస్తీనా ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తర గాజాలోని అల్ సఫ్టవే ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్లో శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారని, ఆ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిందని హమాస్ ఆరోపించింది. దీంతో 20 మంది మరణించారని వెల్లడించింది. గాయపడిన వారిని అల్-షిఫా హాస్పిటల్కు తరలించామని చెప్పింది. కాగా, శుక్రవారం ఓ అంబులెన్స్పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు.
గత నెల 7న ప్రారంభమైన ఇజ్రాయెల్పై హమాస్ దాడితో ఇరు పక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఇప్పటివరకు సుమారు 9,227 మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 3,826 మంది చిన్నారులు ఉన్నారు. ఇక హమాస్ దాడిలో 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. కాగా, ఇరు పక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లికెన్ చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది.
శుక్రవారం ఇజ్రాయెల్లో పర్యటించిన ఆంటోని బ్లింకెన్ ఆ దేశ ప్రధాని బెంబమెన్ నెతన్యాహూతో టెల్ అవీవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానవతా సహాయం నిమిత్తం కాల్పుల విరమణ ప్రకటించాలని ఆయనను కోరారు. అయితే దీనికి నెతన్యాహూ నిరాకరించారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించేవరకు యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు.