వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున భారీ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మాస్ షూటింగ్లో ఇద్దరు మరణించినట్లు పిట్స్బర్గ్ పోలీసులు తెలిపారు. మృతులిద్దరూ మైనర్ బాలురని, మరో 9 మంది గాయపడ్డారని చెప్పారు. పార్టీలో 200 మందిపైగా పాల్గొన్నారని, చాలా మంది టీనేజ్ వారేనని వెల్లడించారు. గాయపడిన 11 మందిని ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు బాలురు అక్కడ చనిపోయినట్లు తెలిపారు. మృతుల్ని ఇంకా గుర్తించలేదన్నారు.
కాగా, ఈ పార్టీలో సుమారు 50 రౌండ్ల మేర కాల్పులు జరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పార్టీ వేదిక బయట కూడా పలు రౌండ్ల కాల్పులు జరిగాయని చెప్పారు. పిస్టల్స్, రైఫిల్స్తో కాల్పులకు పాల్పడినట్లు షెల్ కేసింగ్ల ద్వారా తెలుస్తున్నదని అన్నారు. కాల్పుల నేపథ్యంలో చాలా మంది భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. దీంతో పలువురు గాయపడినట్లు చెప్పారు. బిల్డింగ్ కిటికీ నుంచి దూకిన ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగినట్లు వెల్లడించారు.