అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థాన్ జాతీయుడు మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం అబుదాబిలోని ఒక ఆయిల్ ఫీల్డ్లో మూడు ఆయిల్ ట్యాంక ర్ల వద్ద, అంతర్జాతీయ విమానాశ్రంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు చనిపోయినట్లు అబుదాబి పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థానీ మరణించినట్లుగా గుర్తించారు. మరో ఆరుగురు గాయపడినట్లు వెల్లడించారు.
కాగా, డ్రోన్లకు చెందిన చిన్న ఎగిరే వస్తువులను ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. అవి రెండు ప్రాంతాల్లో పడటంతో పేలుడు, మంటలకు కారణమై ఉండవచ్చని చెప్పారు. ఈ ఘటనల వల్ల పెద్దగా నష్టం ఏమీ జరుగలేదన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నదని వివరించారు.
మరోవైపు ఈ దాడి తమ పనేనని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. యూఏఈలో అనేక దాడులకు పాల్పడినట్లు ఇరానియన్ మద్దతుగల హౌతీలు పేర్కొన్నారు. అయితే యూఏఈ అధికారులు ఈ స్టేట్మెంట్ను తిరస్కరించారు.