Afghanistan | అధికారంలో వస్తే మంచి పాలన అందిస్తామని, స్త్రీలకు కూడా చదువుకునేందుకు ,ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తాలిబన్లు.. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆఫ్ఘాన్ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్ నాయకులు.. కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. మహిళలను చదువు, ఉద్యోగాలకు దూరం చేశారు. వారు బయట తిరగకుండా కఠిన ఆంక్షలు విధించారు.
ఇప్పుడు షరియా చట్టం ద్వారా అక్కడి ప్రజలను తీవ్రంగా హింసిస్తున్నారు. తాజాగా తఖార్ ప్రావిన్సులోని తలూఖన్ నగరంలో పలు నేరాలకు పాల్పడిన 19 మందిని బహిరంగంగా కొరడాతో కొట్టి శిక్షించారు. శిక్ష అనుభవించిన వారిలో 10 మంది పురుషులు కాగా, తొమ్మిది మంది మహిళలు ఉన్నట్లు తాలిబన్ అధికారి అబ్దుల్ రహీం రషీద్ తెలిపారు. ఒక్కొక్కరికి 39 కొరడా దెబ్బలు కొట్టినట్లు చెప్పారు. ఈ నెల 11న పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలో షరియా చట్టాలకు లోబడి శిక్ష అమలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
తప్పు చేసిన వారిని బహిరంగంగా శిక్షించడమే షరియా చట్టం ముఖ్య ఉద్దేశం. నేరాలు చేయాలంటేనే భయపడేలా ప్రజలు బహిరంగంగా ఉరితీయడం, కాళ్లు, చేతులు విరగ్గొట్టడం, కొరడా దెబ్బలు కొట్టడం వంటివి ఈ చట్టం కిందకు వస్తాయి. ఆఫ్ఘాన్ను కైవసం చేసుకున్న తర్వాత తాలిబన్లు ఇలాంటి శిక్ష విధించడం ఇదే తొలిసారి. 1990లోనూ తాలిబన్లు ఇలాంటి శిక్షలే విధించేవారు. న్యాయస్థానంలో శిక్ష పడిన వారిని బహిరంగంగా ఉరితీసేవారు. కొరడాతో కొట్టి శిక్షించడం, రాళ్లతో కొట్టి చంపేవారు. మళ్లీ ఇప్పుడు ఇలాంటి శిక్షలు విధిస్తుండడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు.