న్యూఢిల్లీ: గాజాలోని ఆస్పత్రిలో 179 మందిని ఖననం చేసినట్లు అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహమ్మద్ అబూ సల్మియా తెలిపారు. హాస్పిటల్ కాంపౌండ్లో సామూహిక ఖననం సాగిందని, దాంట్లో శిశువులను కూడా పాతిపెట్టినట్లు ఆయన వెల్లడించారు. హాస్పిటల్ కాంపౌండ్లోనే ఖననం చేసే రీతిలో తమపై వత్తిడి తెచ్చారని హాస్పిటల్ డైరెక్టర్ పేర్కొన్నారు. హాస్పిటల్లో ఫ్యూయల్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న ఏడుగురు పసికందులు, 29 మంది రోగులు చనిపోయారని, వారిని అక్కడే ఖననం చేసినట్లు చెప్పారు.
ఆ ఆస్పత్రి నుంచి తాజాగా రిలీజైన ఓ ఫోటో కలిచివేస్తోంది. ఏడుగురు శిశువులను ఒకే దగ్గర కట్టివేసిన ఫోటోను రిలీజ్ చేశారు. జనరేటర్లు నడవకపోవడంతో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అల్ షిఫా ఆస్పత్రి ఓ శ్మశానవాటికలా తయారైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఆ ఆస్పత్రిలో మృతదేహాలుగా గుట్టలుగా ఉన్నాయని, దుర్గంధం వస్తోందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. హాస్పిటల్ సమీపంలో ఇటీవల జోరుగా ఫైటింగ్ కొనసాగుతోంది. హమాస్, ఇజ్రాయిల్ దళాల మధ్య జరుగుతున్న పోరు వల్ల ఆస్పత్రి చుట్టూ బీభత్సకర వాతావరణం నెలకొన్నది.