కిన్షాసా: మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) భారీ వర్షాలు విరుచుకుపడ్డాయి. వాయువ్య మంగల ప్రావిన్స్లోని లిసాల్ పట్టణంలోని కాంగో నదీ (Congo River) తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాల (Torrential rains) ధాటికి ఒక్కాసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై మట్టిపెళ్లలు, బండరాళ్లు పడటంతో 17 మంది దుర్మరణం చెందారు. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
కుంభవృష్టి కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా (Gov. Cesar Limbaya Mbangisa) తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రావిన్స్ అంతటా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.