కరాకస్ : దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాలు పెను విషాదాన్ని నింపాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 164 మంది మృతి చెందగా, 971 మంది గాయపడినట్లు దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. భూకంపాల ధాటికి తీర ప్రాంత రాష్ట్రమైన ‘లాగ్వైరా’ తీవ్రంగా నష్టపోవడంతో ఆ ప్రాంతాన్ని విపత్తు వలయంగా ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు 500కు పైగా సహాయక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. జాతీయ సెలవు దినం కావడంతో& ఈ విపత్తులో మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకూ ఉండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. జూన్ 24 వెనెజువెలా జాతీయ సెలవు దినం కావడంతో ఎక్కువ మంది ఇండ్లలోనే ఉన్నారు. ఇది ప్రాణనష్టం అధికంగా జరగడానికి కారణం కావచ్చని అధికారులు అంటున్నారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) ప్రాథమిక నమూనా అంచనాల ప్రకారం ఈ భూకంపం కారణంగా 100 బిలియన్ డాలర్ల వరకూ భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వెనెజువెలాకు అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం అందుతోంది.
వెనెజువెలా, జపాన్, కాలిఫోర్నియా, భారత్, నేపాల్లో కొద్ది గంటల వ్యవధిలోనే భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల మధ్య సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో, పూర్తిగా భిన్నమైన టెక్టోనిక్ (భూ ఫలకాల) అమరికల్లో సంభవించాయి.
గురువారం జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.
వెనెజువెలాలో భూకంపానికి ముందే లక్షలాది మంది మొబైల్ ఫోన్లకు అప్రమత్తత సందేశం వచ్చింది. భూకంపం ప్రారంభ సంకేతాలను వేగంగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసింది. భూమిలో వచ్చే స్వల్ప కదలికలను కూడా గుర్తించగల ‘మోషన్ సెన్సార్లు’ కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల ఆధారంగా ఈ సాంకేతికత పనిచేస్తుంది.