Mexico | మెక్సికోలో నిర్వహించిన క్రిస్మస్ ముందస్తు వేడుకలు రక్తపాతాన్ని సృష్టించాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్వానాజువాటో రాష్ట్రంలోని సల్వటియేర్రా పట్టణంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు టియేర్రా నెగ్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. అయితే ఓ ఆరుగురు వ్యక్తులను భద్రతా కారణాల దృష్ట్యా ఆ వేడుకకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో క్రిస్మస్ వేడుకలు ముగిసిన అనంతరం అందరూ బయటకు వచ్చి తమ నివాసాలకు వెళ్తుండగా, ఆ ఆరుగురు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ వేడుకకు సుమారు 100 మంది హాజరై ఉంటారని, అందులో యువతీయువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.