Israel-Hamas War | ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుపక్షాలకు చెందిన సుమారు 1600 మంది మరణించారు. బందీలుగా పట్టకున్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు (Hamas Militants) హతమార్చుతున్నది. కాగా, తమ భూభాగంలో సుమారు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం (Israel’s military) ప్రకటించింది. అయితే దీనిపై పాలస్తీనియన్ అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
హమాస్ స్థావరంగా ఉన్న గాజా సిటీపై (Gaza city) తాము పట్టు సాధించామని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ (Richard Hecht) తెలిపారు. గత రాత్రి నుంచి హమాస్ ఉగ్రవాదులు ఒక్కరుకూడా సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్పారు. అయితే అక్రమ చొరబాట్లు ఇప్పటికీ సాధ్యమేనని వెల్లడించారు.
కాగా, గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికిపైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.
మరోవైపు హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) ఘాటు హెచ్చరికలు చేశారు. హమాస్ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తమపై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే ముగిస్తామంటూ హమాస్కు గట్టిహెచ్చరికలు చేశారు.