న్యూఢిల్లీ: బౌద్ద మత గురువు దలైలామా(Dalai Lama) కీలక ప్రకటన చేశారు. దలైలామా సంప్రదాయం తన తర్వాత కూడా కొనసాగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తనతో దలైలామా వ్యవస్థ ఆగిపోదన్నారు. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా అసలు పేరు టెంజిన్ గ్యాస్టో. టిబెట్ ఆయన స్వంత దేశం. తన తదనంతరం కాబోయే దలైలామా ఎంపికలో డ్రాగన్ దేశం చైనా పాత్ర ఏమాత్రం ఉండబోదని ఆయన అన్నారు. భవిష్యత్తు పట్టాభిషేకాన్ని దలైలామాకు చెందిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టు చూసుకుంటుందన్ని ఆయన తెలిపారు.
దలైలామా వ్యవస్థ అంశంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని ఆయన ఆఫీసు ఓ ప్రకటనలో పేర్కొన్నది. హిమాచల్ ప్రదేశ్లోని మెక్లియోడ్గంజ్లో జరిగిన బౌద్ద మతస్థుల మూడు రోజుల కాన్పరెన్స్లో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ఎంతో మంది బౌద్ద మత ప్రముఖులు, విద్యావేత్తలు హాజరయ్యరయ్యారు. దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు టెంజిన్ తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన బౌద్ద సంఘాలు చేసిన విజ్ఞాపన మేరకు దలైలామా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 14 ఏళ్ల నుంచి దీనిపై ఎటువంటి బహిరంగ చర్చ జరగలేదన్నారు. 2011, సెప్టెంబర్ నుంచి దలైలామాకు ఇదే రకమైన మెసేజ్లు వస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుత దలైలామాకు 90 ఏళ్లు నిండిన నేపథ్యంలో.. అధికార మార్పు అంశంపై బౌద్ధ వర్గాల్లో చర్చజరుగుతోంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూలై ఆరో తేదీన దలైలామాకు 90 ఏళ్లు పూర్తి కానున్నాయి. టిబెట్ క్యాలెండర్ ప్రకారం మాత్రం ఆయనకు జూన్ 30వ తేదీనే 90 ఏళ్లు నిండాయి. తనకు 90 ఏళ్లు నిండిన తర్వాత టిబెట్లోని బౌద్ద సంప్రదాయానికి చెందిన లామాలను సంప్రదిస్తానని, టిబెట్ బుద్దిజంతో లింకున్న ప్రతి ఒక్కరితో దలైలామా వ్యవస్థ గురించి చర్చించనున్నట్లు ఆయన చెప్పారు.
భవిష్యత్తు దలైలామాకు చెందిన నియామక ప్రక్రియ గురించి 2011, సెప్టెంబర్ 24వ తేదీన జారీ చేసిన స్టేట్మెంట్లో ఆ విధానం క్లియర్గా ఉందన్నారు. కొత్త దలైలామా నియమాక అధికారాలు.. గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టులో ఉన్న సభ్యుల వద్ద ఆ బాధ్యత ఉన్నట్లు తెలిపారు. దలైలామా వారసత్వంలో ఉన్న ధర్మ రక్షకులను కలుసుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాచీన సంప్రదాయానికి తగినట్లు శోధించి .. భవిష్యత్తు దలైలామా ప్రకటన చేయాలన్నారు. కాబోయే దలైలామాను ఎంపిక చేసే అధికారం కేవలం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని, మరెవరికీ దీంట్లో జోక్యం చేసుకునే వీలులేదన్నారు.
దలైలామా సంప్రదాయ కొనసాగింపు అంశంలో.. చైనా నుంచి ఎవర్నీ ఎంపిక చేయరాదు అన్న నిబంధన కూడా ఉన్నది. 2011, సెప్టెంబర్ 24 నాటి ప్రకటనలో ఈ విషయం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ నుంచి చైనాను దూరం పెట్టాలని అమెరికా, భారత్ భావిస్తున్నాయి. కానీ 1949 నుంచి చైనా ఆక్రమణలో టిబెట్ ఉన్న విషయం తెలిసిందే.