అంకారా: తుర్కియే, సిరియా సరిహద్దులో భారీ భూకంపం సంభవించిన 11 రోజుల తర్వాత శిథిలాల నుంచి ఒక బాలుడు, మరో ఇద్దరు సజీవంగా బయటపడ్డారు. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ముగ్గురిని రెస్క్యూ బృందం రక్షించినట్లు తుర్కియే ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. శుక్రవారం హటే ప్రావిన్స్లో 14 ఏళ్ల ఉస్మాన్ను శిథిలాల నుంచి బయటకు తీసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. స్ట్రెచ్చర్పై ఆ బాలుడ్ని తీసుకెళ్తున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. బాలుడి అరుపులు విన్న రెస్క్యూ సిబ్బంది అతడ్ని కాపాడినట్లు వివరించారు.
కాగా, గంట తర్వాత మరో చోట ఇద్దరు వ్యక్తులను కూడా రెస్క్యూ బృందం కాపాడిందని తుర్కియే ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. 26 ఏళ్ల మెహ్మెట్ అలీ సకిరోగ్లూ, 33 ఏళ్ల ముస్తఫా అవ్సీగా వారిని గుర్తించారు. ఒక బిల్డింగ్ శిథిలాల నుంచి వారిద్దరూ బయటపడినట్లు పేర్కొన్నారు.
మరోవైపు తుర్కియే, సిరియాలో గత సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 43,000 దాటింది. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం వల్ల నిరాశ్రయులైన లక్షలాది ప్రజలు గడ్డకట్టే చలిని తట్టుకుని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
భూకంపం వల్ల తుర్కియేలోని 11 ప్రావిన్సుల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు మూడు ప్రావిన్సులలో రెస్క్యూ చర్యలు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భూకంపం సంభవించి పది రోజులు దాటిన తర్వాత కూడా ఆశ్చర్యంగా కొందరు వ్యక్తులు శిథిలాల నుంచి సజీవంగా బయటపడుతున్నారు.