న్యూఢిల్లీ: నేపాల్ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. తారా ఎయిర్లైన్స్కు చెందిన 9 ఎన్-ఏఈటీ ట్విన్ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటల సమయంలో ముస్తాంగ్లో గల్లంతైన విషయం తెలిసిందే. విమానం ఆచూకీని సోమవారం ఉదయం సైన్యం గుర్తించింది. ప్రతికూల వాతావరణం ఉండటంతో సన్సోవార్లో ఉన్న కొండల అంచులను ఢీకొట్టిన విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయింది. దీంతో విమానం ఆచూకీని గుర్తించడానికి అధికారులకు ఆసల్యమయింది. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు.
కాగా, సోమవారం ఉదయం గాలింపు, సహాయక చర్యలు ప్రారంభించిన సైన్యం సన్సోవార్ సమీపంలో శకలాలను గుర్తించారు. విమానం ఎత్తునుంచి కిందపడిపోవడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడియాయని, విమాన శకలాలుకు వంద మీటర్ల దూరం వరకు పడిపోయాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశాని, వారిలో ఐదు మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఖట్మండులోని దవాఖానకు తరలించామన్నారు. చిన్న హెలికాప్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.