ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని (Pakistan) స్వాత్ (Swat) లోయలో దారుణం చోటుచేసుకున్నది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో (Khyber Pakhtunkhwa) ఉన్న స్వాత్లో కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్మెంట్ (CTD- Counter Terrorism Department) పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు (Bomb blast) సంభవించింది. రెండు సార్లు పేలుడు చోటుచేసుకోవడంతో బిల్డింగ్ పూర్తిగా నేలమట్టయింది. దీంతో 13 మంది పోలీసులు మృతిచెందారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్ లోపల రెండు సార్లు భారీ పేలుళ్లు సంభవించాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రావిన్స్ మొత్తం హై అలర్ట్ ప్రకటించినట్లు ఖైబర్ ఫఖ్తుంఖ్యా ఐజీ అక్తర్ హయత్ ఖాన్ (Akhtar Hayat Khan) తెలిపారు.
ఇది ఆత్మాహుతి దాడి (Suicide attack) కాదని, ఆయుధాలు, మోటార్ షెల్స్ (Ammunition and Mortar shells) భద్రపరిచిన ప్రదేశంలో పేలుడు సంభవించిందని చెప్పారు. స్టేషన్పై ఎలాంటి దాడి కానీ, స్టేషన్ లోపల కాల్పులు కానీ జరగలేదని స్పష్టం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ పేలుళ్లు జరిగి (Explosion) ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘనపై బాంబ్ డిస్పోజల్ స్వాడ్ దర్యాప్తు జరుపుతుందని వెల్లడించారు. పేలుళ్ల దాటికి భవనం పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. కాగా, అంతకు ముందు ఇది ఆత్మాహుతి దాడి అని జిల్లా పోలీస్ అధికారి షఫీ ఉల్లా గందాపూర్ చెప్పారు. పేలుడు ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ ఫరీఫ్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పేలుడుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.