లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్ సిటీలో ఉన్న 1200 ఏళ్ల క్రితం నాటి హిందూ దేవాలయాన్ని పునరుద్దరించనున్నారు. బుధవారం దీనికి సంబంధించిన కోర్టు తీర్పును వెలువరించారు. చాలా సుదీర్ఘ కాలం పాటు ఆ ఆలయ నిర్మాణంపై కోర్టులో కేసు వాదనలు జరిగాయి. లాహోర్లోని అనార్కలి బజార్ వద్ద ఉన్న వాల్మీకి మందిరాన్ని ఎవక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు స్వాధీనం చేసుకున్నది. ఓ క్రైస్తవ ఫ్యామిలీ నుంచి ఆ ప్రాపర్టీని పొజిషన్లోకి తీసుకున్నారు. లాహోర్లో కృష్ణ టెంపుల్, వాల్మీకి ఆలయాలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. హిందూ మతాన్ని స్వీకరించిన ఓ క్రైస్తవ ఫ్యామిలీ.. వాల్మీకి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తుల్ని అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రకారమే వాల్మీకి ఆలయాన్ని పునరుద్దరిస్తామని ఈటీపీబీ ప్రతినిధి అమిర్ హస్మీ తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఓ క్రైస్తవ కుటుంబం ఆలయాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 1992లో బాబ్రీ మసీదు దాడి తర్వాత.. పాకిస్థాన్లోని వాల్మీకి ఆలయాన్ని స్ధానికులు ధ్వంసం చేశారు. ఆ గుడిలో ఉన్న కృష్ణుడు, వాల్మీకి విగ్రహాలను ధ్వంసం చేశారు.