కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ నగరంలోగల పరాచ చౌక్ ఏరియాలో ఈ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి సమీపంలో భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ బ్యాంకు బిల్డింగ్ కుప్పకూలింది. దాంతో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉండి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
అందుకే బాధితులెవరైనా ఉంటే రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం క్షతగాత్రులంతా షాహీద్ మహాత్మా బెనజీర్ భుట్టో ఆస్పత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు. నాలా గుండా ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్లైన్లో ఈ మధ్యాహ్నం పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో నాలాపై నిర్మించిన ఓ ప్రైవేటు బ్యాంకు భవనం కుప్పకూలిందని చెప్పారు. పేలుడు సమయంలో బ్యాంకులో 9 మంది సిబ్బంది ఉన్నారని, కస్టమర్లు ఎంత మంది ఉన్నారనే విషయంలో క్లారిటీ లేదని తెలిపారు.