1,500 మందికిపైగా గాయాలు.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
పాకిస్థాన్లోనూ భూ ప్రకంపనలు.. ఒకరు మృతి
కాబుల్, జూన్ 22: అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు అఫ్గానిస్థాన్లోని ఖోస్త్ ప్రావిన్సులో బుధవారం తెల్లవారుజామున పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 1000 మంది దాకా మృత్యువాత పడగా, 1,500 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వార్తా సంస్థ ‘బక్తర్ న్యూస్ ఏజెన్సీ’తెలిపింది. తాలిబన్లు అఫ్గానిస్థాన్ను కైవసం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ సహాయక సంస్థలు అఫ్గాన్ను వీడడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారింది. పైగా ప్రకృతి వైపరీత్యం మారుమూల గ్రామీణ, పర్వత ప్రాంతంలో సంభవించడంతో సమాచారం అందడం కూడా కష్టం అవుతున్నదని న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. 1998లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అప్పుడు 4500 మంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత ఇంత భారీ వైపరీత్యం చోటుచేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ఇండ్లు మట్టితో నిర్మించడం, సాధారణంగా కొండ చరియలు విరిగి పడే ప్రాంతం కావడం కారణంగా భారీ ప్రాణనష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్లోనూ ప్రకంపనలు..
అఫ్గానిస్థాన్లోని పక్టికా ప్రావిన్సులోని ఖోస్త్ నగరానికి నైరుతి దిక్కున 50 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్లో కూడా భూకంపం ప్రభావం చూపింది. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పలుచోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పాక్లో ఒకరు మృత్యువాత పడ్డట్టు అధికారులు తెలిపారు. కాబుల్లో అఫ్గాన్ ప్రధాని మహమ్మద్ హసన్ అఖండ్ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సహాయక సంస్థలు సాయం చేయాల్సిందిగా ట్విట్టర్ ద్వారా అర్థించారు. దీంతో సహాయక బృందాలను పంపుతున్నట్టు అఫ్గానిస్థాన్లోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కో ఆర్డినేటర్ రమీజ్ అలక్బరోవ్ సమాధానం ఇచ్చారు.