లాహోర్: పాముకు పాలుపోసి పెంచితే ఏమవుతుంది.. ఇప్పుడు పాక్ విషయంలో కూడా అదే జరుగుతున్నది. టెర్రరిజాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్కు ఇప్పుడు అదే వారికి తలనొప్పిగా మారింది. వరుసగా తమ సైన్యంపై దాడులకు పాల్పడుతూ జవాన్లను పొట్టనపెట్టుకుంటున్నారు. తాజాగా ఇరాన్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఓ చెక్పోస్టుపై మెరుపుదాడి చేశారు. బాంబులు, గుండ్ల వర్షం కురిపించింది. దీంతో పది మంది సైనికులు మృతిచెందారు.
బలూచిస్థాన్ ప్రావిన్స్లోని కెచ్ జిల్లాలో ఉన్న సైనిక చెక్పోస్టుపై ఉగ్రవాదులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాడికి పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. టెర్రరిస్టుల దాడికి తమ సైన్యం ఎదురుదాడి చేసిందని, ఇందులో పది మంది సైనికులు, ఓ ఉగ్రవాది చనిపోయారని చెప్పారు. పలువురు ఉగ్రవాదులను పట్టుకున్నామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపూ ప్రకటించలేదు.
బలూచిస్థాన్ ప్రావిన్స్ ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నది. ఇక్కడ చాలా కాలం నుంచి హింస కొనసాగుతున్నది. గతంలో చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు పలుమార్లు సైనికులపై దాడిచేశారు. ఈనెల 5న ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించగా, పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.